కోస్తాలో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం శనివారం ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో గుజరాత్ నుంచి ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తాలో ముసురు వాతావరణం నెలకొని వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షాలు పడ్డాయి. శనివారం సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 6.5, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో 6, అనంతగిరిలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజుల వరకు కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసి పడుతున్నాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.