ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలో మద్యం, మాంసం అమ్మకాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఆలయాల పవిత్రత కోసమంటూ వాటి సమీప ప్రాంతాల్లో మద్యం, మాంసాల వినియోగంపై వేటు వేయనున్నారు. అది కూడా మామూలు నిషేధం కాదు. అక్కడ వాటిని అమ్మినా, కొన్నా, తిన్నా, తాగినా శిక్షలు పడతాయి. ఆలయాల చుట్టుపక్కల మద్యం, మాంసం ఆనవాళ్లు కనిపిస్తే చర్యలు తీసుకునేలా వారణాసి మునిసిపల్ కార్పొరేషన్ ఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఇవీ నిబంధనలు:
నగరంలోని ఆలయాలు, చారిత్రక కట్టడాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. వాటికి 250 మీటర్ల దూరంలో మద్యం, మాంసం కనిపించకూడదని తెచ్చిన ప్రతిపాదనను కార్పొరేషన్ ఎగ్జికూటివ్ కౌన్సిల్ ఆమోదించిందని, తుది ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని మేయర్ మృదులా జైస్వాల్ వెల్లడించారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నగరానికి ‘గుడ్ ఇమేజీ’ కోసం బీజేపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గంగానది ప్రక్షాళన అందులో ఒకటి. కాగా, మద్యం, మాంసంపై కాశీలో తేబోతున్న నిషేధాన్ని అయోధ్య, మథుర తదితర మత ప్రాధాన్య నగరాల్లోకూ అమలు చేసే అవకాశముందందని వార్తలు వస్తున్నాయి. కాశీ, బృందానం, అయోధ్య, చిత్రకూట్, దేవా షరీఫ్ తదితర ప్రాంతాల్లోని ఆలయాల వద్ద మద్యం, మాంసం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు యోగి ఏప్రిల్ నెలలోనే చెప్పారు. అయితే ఆ ప్రాంతాల్లో వాటి వాడడంపైనా తాజాగా నిషేధం తెచ్చారు.