తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన శనివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్స వం, ఊంజల్సేవలను రద్దు చేశారు.