తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శనివారంనాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను మురిపించాడు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.
సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయలమీద స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించాడు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కారణంగా ఆర్జిత వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.