మోసంతో మూడు దశాబ్దాలు ఎంజాయ్ చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ మోసగాడు సౌదీ అరేబియా యువరాజునని చెప్పుకుని 30 ఏళ్లు చలామణీ అయ్యాడు. జనాల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నాడు. పాపం పండుతుంది అంటారు కదా.. అలా అతని పాపం కాస్త ఆలస్యంగా పండింది. దీంతో అతనికి 18 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఆంథోనీ జిగ్నాక్(48) గత మూడు దశాబ్దాలుగా సౌదీ యువరాజు ఖలీద్ బిన్ అల్ సౌద్నని చెప్పుకుని అందరినీ నమ్మించాడు.
ఫ్లోరిడాలోని మియామీ ఫిషర్ ద్వీపంలో నివసిస్తూ నకిలీ డిప్లొమాటిక్ లైసెన్స్ ప్లేట్తో ఫెరారీలో తిరిగేవాడు. అతడి చుట్టూ పెద్ద సంఖ్యలో బాడీగార్డులు కూడా వుండేవారు. వారి చేతుల్లో కూడా నకిలీ డిప్లొమాటిక్ కాగితాలు వుండేవి. అతని దర్పం, డాబు చూసి అందరూ అతను నిజంగానే సౌదీ యువరాజే అనుకున్నారు. ఆ వేశంతో జనాలకు కుచ్చుటోపీ పెట్టాలనుకున్నాడు. ఓ పథకం రచించాడు. తాను డబ్బులు పెట్టుబడి పెడతానని, తనతో చేరాలనుకున్న వారు ఆ డబ్బును తన ఖాతాలో వేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని నమ్మించాడు. యువరాజు మాటలు నమ్మిన చాలామంది ప్రజలు దాదాపు 8 మిలియన్ డాలర్ల(రూ.55,66,36,800)ను ఆయన ఖాతాలో వేశారు.
ఇంకే ఆ డబ్బు ప్రైవేటు జెట్లు, బోట్ రేసింగ్లు, డిజైనర్ దుస్తులకు ఉపయోగించాడు. చక్కగా మోసం చేసుకుపోతున్న అతణ్ని పంది మాంసం పట్టించింది. ముస్లింలు పోర్క్ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ చెంతకు రానీయరు. జిగ్నాక్ మాత్రం చక్కగా పోర్క్ లాగించసాగాడు. ఇది గమనించిన ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ అతని బండారాన్ని బయటపెట్టాడు. దీంతో జిగ్నాక్ను 2017 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతడికి 18 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు. దీంతోపాటు మోసపూరితంగా నకిలీ పత్రాలు వాడినందుకు కూడా అతడిపై అభియోగాలు నమోదయ్యాయి.