కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి షకీల్ అహ్మద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బీహార్లోని మధువని సీటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారంనాడు తాను నామినేషన్ వేస్తున్నట్టు చెప్పారు.కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయక నియోజకవర్గమైన మధుబనిని 'మహాకూటమి' సీట్ల పంపకంలో భాగంగా వీఐపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతివ్వాలని, పార్టీ అధిష్ఠానం అందుకు అంగీకరించకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాయమని ఆదివారంనాడు మధుబనిలోని తన నివాసంలో షకీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మధుబనిలో మహాకూటమి అభ్యర్థి ఎంతమాత్రం బీజేపీ అభ్యర్థిని ఓడించలేరని షకీల్ అహ్మద్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తనకు మద్దతిస్తే తాను అక్కడ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అశోక్ యాదవ్ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.