నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 200 వీవీప్యాట్ స్లిప్పులని విద్యార్ధులు కనుగొన్నారు. వెంటనే ఉపాధ్యాయులకు తెలపడంతో వారు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ స్లిప్పులను భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకొని పాఠశాలకు వచ్చిన ఆర్డీవో బృందానికి అనేక కవర్లలో స్లిప్పులు దొరికాయి. ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.