మే 23న లెక్కింపు తర్వాత ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి అప్పులే స్వాగతం చెప్పనున్నాయి. రోజువారీ ఖర్చుకు సహితం ఇబ్బందికరంగా ఆర్ధిక పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ముందు పలు సంక్షేమ కార్యక్రమాల కింద ప్రజలకు నగదు బదిలీకి ప్రభుత్వం ఇష్టం వచ్చిన్నట్లు అప్పులు చేయడంతో ఇక అప్పులు పుట్టడం కూడా అసాధ్యంగా కనిపిస్తున్నది.
ఆర్ధిక సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మొదటి మూడు నెలల కాల రుణపరిమితిలో 62శాతాన్ని (5వేల కోట్ల రూపాయలను) ప్రభుత్వం ఇప్పటికే వాడేసింది. ఇంత భారీ మొత్తాన్ని ఈ నెల 9వ తేది ఒక్కరోజే రుణంగా తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా మరో రూ 1,000 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును ఆర్బిఐ తిరస్కరించింది. అంతేకాదు, సురక్షితంగా అప్పులు ఎలా చేయాలో వివరిస్తూ సున్నితంగా మందలించింది కూడా!
ఆర్బిఐ నిబంధనల ప్రకారం ఆర్థికసంవత్సరంలో మొదటి త్రైమాసికానికి (జూన్ నెలాఖరు వరకు) 8,104 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. దీనిలో 5 వేల కోట్ల రూపా యలను ఈ నెల 9వ తేది అప్పుగా తీసుకుంది. ఆ మొత్తం ఖర్చు అయిపోవడంతో ఈ నెల 15వ తేది జరగనున్న వేలంలో వెయ్యి కోట్ల రూపాయల రుణం సర్ధుబాటు చేయాలంటూ చేసిన విజ్ఞప్తిని ఆర్బిఐ తిరస్కరించింది.