బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం అధికారికంగా విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఏప్రిల్ 8వ తేదీన సంకల్ప్ పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై జైట్లీ స్పష్టతనిచ్చారు. ఆదివారం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ విజన్ 2019 పేరుతో వివరాలు వెల్లడించారు. అవినీతి పాలనను అందించేందుకు కృషి చేస్తామని, దేశానికి సమర్థుడైన నేత కావాలని, మరోసారి నరేంద్ర మోదీ నినాదాలతో బీజేపీ ప్రచారం కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలు సోమవారం ప్రకటిస్తామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో మధ్య తరగతి ప్రజల ఊసే లేదని, ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మేనిఫెస్టో రూపకల్పనకు ఒక కమిటీ వేయగా, దానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నాయకత్వం వహించారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ మేనిఫెస్టో లో జనరంజన పథకాలు ఏమైనా ప్రకటిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.