ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌కు బీసీలంటే చులకన : రాజేంద్రప్రసాద్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2019, 10:40 PM

వైకాపాకు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు బీసీలంటే చులకన భావమని.. అధికారంలోకి వస్తే వారికి ఏం చేస్తారన్నది మేనిఫెస్టోలో పేర్కొనలేదని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి జగన్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వైకాపా మేనిఫెస్టోపై ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల గురించి మేనిఫెస్టోలో వైకాపా పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విదేశాలకు వెళ్లి చదువుకోవడం వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఇష్టం లేదు. బీసీలను పేదరికంలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు’’ అని రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే బీసీ విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.2 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని, భవిష్యత్తులో దీనిని రూ.3 వేలకు పెంచుతామని చెప్పారు. వైకాపా మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి గురించి అసలు ప్రస్తావనే లేదని రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. నిరుద్యోగ యువత అంటే  జగన్‌కు చిన్న చూపన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ గురించి వైపాకా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టి, ఉపాధి కల్పనపై జగన్‌కు కనీస అవగాహన లేదని రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com