ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఒంగోలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి భీటీ అయ్యారు. ఇటీవల కొంత కాలం నుంచి మాగుంట టీడీపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే వీరి భేటీలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాజకీయ పరిస్ధితులపై చర్చ జరిగినట్లు సమాచారం ప్రధానంగా ఒంగోలు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్ధుల ఖరారుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబును మాగుంట కోరినట్లు సమాచారం. యర్రగొండపాలెం, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాలపై చంద్రాబాబుతో కీలక చర్చ చేసినట్లు తెలుస్తోంది. అయితే సీయంతో సమావేశం ముగిసిన తరువాత బయటకు వచ్చిన మాగుంట అక్కడ ఉన్న మీడియా వారికి చిరునవ్వతో ఒక నమస్కారం చేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దీంతో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల కొంత కాలం నుంచి మాగుంట పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగడమే కాకుండా తన అనుచరులు, అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసులురెడ్డిని పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం.