జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన దాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జవాన్లకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కావాల్సినన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది విషాదకరమైన రోజు అని, సైన్యానికి చెందిన సుమారు 40 మంది జవాన్ల ప్రాణాలను ఈ దేశం కోల్పోయిందని, ముందుగా మనం వారి కుటుంబాలకు స్వాంతన కల్పించాలని మన్మోహన్ అన్నారు. విపక్షాలన్నీ జవాన్లకు, ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. సైన్యానికి, ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని, ఈ విషయంలో మరో ప్రస్తావన లేదని రాహుల్ అన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైందని, భద్రతా దళాలపై ఇటువంటి దాడి జరగడం అత్యంత హేయంగా ఉందని, దేశాన్ని విభజించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారని, కానీ తాము డివైడ్ కాబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.