ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయిలో ఘోర ప్రమాదం.. 9 మందికిపైగా తీవ్ర గాయాలు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 12:56 PM

ముంబయి: దీపావళి పండగ సందర్భంగా దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్‌లు కిక్కిరిసిపోతున్నాయి. పండగను ఇంటి దగ్గర సంతోషంగా జరుపుకుందామని లక్షల సంఖ్యలో ప్రయాణికులు స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబయి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.ముంబయి నుంచి సొంతూళ్లకు బయలుదేరి వెళ్లడానికి బాంద్రా టెర్మినస్‌కు ప్రయాణికులు భారీగా చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ నంబర్ 1 నిండిపోయింది. అదే సమయంలో బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన నంబర్ 22921 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. ప్లాట్ ఫామ్‌పైకి రావడంతో తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు పడటంతో చాలా మందికి ఊపిరాడలేదు. ఇవాళ వేకువజామున 5:56 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను రైల్వే భద్రత సిబ్బంది, పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. క్షతగాత్రుల్లో రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), సంజయ్ తిలక్ రామ్ కాంగే (27), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18), దివ్యాన్షు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్‌ షరీఫ్ షేక్ (25) ఉన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com