ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడావి ద్వంద్వ ప్రమాణాలు.. భారత హైకమిషనర్ వర్మ విమర్శలు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 11:06 PM

ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో‌పై అక్కడ హైకమిషనర్‌గా వ్యవహరించిన సీనియర్ దౌత్యవేత్త సంజయ్ వర్మ తీవ్రంగా మండిపడ్డారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వెల్లడించారు. భారత్‌ పట్ల కెనడా వ్యవహరించిన తీరు ఏమాత్రం సబబుగా లేదన్నారు. అంతేకాదు, భారత్‌కు వెన్నుపోటు పొడిచిందని వర్మ ఆరోపించారు. నిజ్జర్‌ హత్య కేసులో వర్మను ఇరికించే ప్రయత్నం చేయడంతో తీవ్రంగా స్పందించిన భారత్.. ఆయన్ని వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే.


ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ వర్మ మాట్లాడుతూ.. ఎంతో స్నేహపూరిత ప్రజాస్వామ్య దేశంగా ఉండాల్సిన కెనడా.. స్థాయికి తగ్గట్టు వ్యవహరించలేదని తూర్పారబట్టారు. కెనడా భూభాగం నుంచి భారత్‌కు వ్యతిరేకంగా వేర్పాటువాదులు, ఉగ్రమూఠాలు చేపడుతోన్న ఆపరేషన్ల గురించి ఆధారాలు సమర్పించినా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో పాటు 26 మంది వేర్పాటువాదులు, గ్యాంగస్టర్ల అప్పగింతపై పదే పదే అభ్యర్థనలు చేసినా పట్టించుకోలేదన్నారు. కెనడావి పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలని ఆయన అన్నారు. ‘మీకు ఒక చట్టం వర్తిస్తుంది... మాకు మరొక చట్టం వర్తిస్తుంది.. అది ప్రపంచంలో మరో దేశంల పని చేయదు. గతంలో దక్షిణాసియా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు చెప్పినట్లు చేసేవి.. కానీ ఆ రోజులు పోయాయి’ అని ఆయన అన్నారు.


కెనడా అధికారులతో అక్టోబరు 12న జరిగిన తన చివరి సమావేశం గురించి వర్మ మాట్లాడుతూ.. తాను మరో ఐదుగురు సహోద్యోగులపై నిజ్జర్ హత్య కేసుతో ముడిపెట్టారని అన్నారు. మమ్మల్ని విచారించడానికి దౌత్యపరమైన ఇమ్యూనిటీ తొలగించాలని భారత్ ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. నా పదవీకాలం మొత్తం (కెనడా హైకమిషనర్‌గా)అన్ని మంత్రిత్వ శాఖలతో, ప్రతినిధులతో నా సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా కొనసాగాయని చెప్పారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినేలా కెనడా ప్రవర్తించిందని, అక్కడ మేం ఎలాంటి రహస్య ఆపరేషన్లు చేపట్టలేదని పేర్కొన్నారు.


కానీ, భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందన్నారు. ఆ దేశంలో న్యాయవ్యవస్థ సున్నితంగా ఉన్నట్లుగా తెలుస్తోందని, అందుకే అక్కడ ఖలిస్థానీలు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. అయితే, అక్కడ అతి తక్కువ సంఖ్యలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని, మిగతా సిక్కు కుటుంబాలను వారు భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు అనేక అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఖలిస్థాన్‌ అనే ఒక నేర సంస్థ. సాధారణ సిక్కులను బెదిరిస్తోందన్నారు. వారిపై చర్యలు తీసుకోకపోవడమంటే వారిని ప్రోత్సహించడంతో సమానమని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com