ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరిహద్దుల్లో తగ్గిన భారత్ చైనా ఉద్రిక్తతలు.. ఏళ్ల తర్వాత వెనక్కి వెళ్లిపోయిన సైన్యం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 11:02 PM

2020 జూన్‌లో భారత్ చైనా సరిహద్దుల్లోని తూర్పు లఢఖ్‌ వద్ద రెండు దేశాల సైనికులకు మధ్య జరిగిన ఘర్షణతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించాయి. తాత్కాలికంగా ఉండేందుకు టెంట్లు, ఇతర సామాగ్రిని కూడా తరలించాయి. ఇక చైనా అయితే మరో అడుగు ముందుకేసి.. సరిహద్దుల్లో భారీగా నిర్మాణాలు చేపట్టడం, హెలిప్యాడ్‌లు నిర్మించడం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినట్లయింది. ఓవైపు సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితి ఉండగా.. మరోవైపు.. రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన చర్చలు సఫలం కాగా.. సరిహద్దుల్లో నుంచి సైన్యాన్ని రెండు దేశాలు వెనక్కి తీసుకెళ్లాలని నిర్ణయించాయ.


ఈ మేరకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉధ్రిక్తతలకు ముగింపు పలికేందుకు.. ఇటీవలె ఒప్పందం కూడా కుదిరింది. అదే సమయంలో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో రెండు దేశాల అధినేతలు అయిన నరేంద్ర మోదీ, షీ జిన్‌‍పింగ్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే తూర్పు లఢఖ్‌లోని రెండు కీలక ప్రాంతాల నుంచి భారత్‌, చైనా బలగాల ఉపసంహరణ మొదలైనట్లు భారత రక్షణ శాఖ అధికారులు తాజాగా తెలిపారు. దీంతో భారత్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికినట్లయింది.


తూర్పు లఢఖ్‌ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి భారత్ చైనా బలగాలు వెనక్కి వెళ్తున్టన్లు రక్షణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంతంలోని సైనిక సామాగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో గతంలో వేసిన టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యం తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక చార్దింగ్‌ లా పాస్‌కు సమీపంలోని నదికి పశ్చిమ దిశగా భారత సైన్యం.. తూర్పు దిశగా చైనా సైనికులు వెనక్కివెళ్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ డెమ్చోక్, డెస్పాంగ్ ప్రాంతాల్లో భారత్ చైనా సరిహద్దులకు రెండు వైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు.. 12 టెంట్లు ఉన్నట్లు సమాచారం.


ఇక సరిహద్దుల్లో రెండు దేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియ అంత పూర్తయిన తర్వాత మరో 4, 5 రోజుల్లో డెస్పాంగ్‌, డెమ్చోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి మళ్లీ గస్తీని ప్రారంభించడంపై ఇరుదేశాల మధ్య ఇటీవలె ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. 2020 గల్వాన్‌ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితిని ఎల్‌ఏసీ వెంబడి కొనసాగనున్నట్లు తెలిపారు. రెండు దేశాల సైన్యం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చన్న ఒప్పందాన్ని బ్రిక్స్‌ సదస్సులో మోదీ, జిన్‌పింగ్‌ ధ్రువీకరించారు.


2020 జూన్‌ 15వ తేదీన తూర్పు లఢఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అటు చైనా సైనికులు కూడా భారీగానే చనిపోగా.. ఆ విషయాన్ని డ్రాగన్ బయటికి రానివ్వలేదు. ఈ ఘర్షణల్లో భారీగా చైనా సైనికులు చనిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చాలా రోజుల తర్వాత కేవలం ఐదుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్లు డ్రాగన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘర్షణల కారణంగా ఎల్‌ఏసీ వెంబడి రెండు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com