ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:25 PM

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్‌ టీడీపీ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్‌ పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పళ్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండలం గుత్తెనదీవికి చెందిన రాజశేఖర్‌ గత కొన్నేళ్ల నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో కాకినాడ రూరల్‌ అసెంబ్లీ స్థానం కోసం ప్రయత్నించారు. చివరికి జనసేనకు కేటాయించడంతో భంగపడ్డారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌గా వ్యవహరస్తూ ఈ ప్రాంతంలో చంద్రబాబు పర్యటనలకు ఏర్పాట్లు చేయడంలో విజయవంతమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజశేఖర్‌కు ఏదో పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాజశేఖర్‌ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రకటించింది. అయితే కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఆ స్థానం కోసం మాజీ మంత్రి మెట్ల తనయుడు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మెట్ల రమణబాబు పేరును పరిశీలించాల్సిందిగా కోనసీమ జిల్లాకు చెందిన టీడీపీ నాయకత్వం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభ్యర్థించింది. ఎంపీ, ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసి రమణబాబుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. పార్టీ అధిష్ఠానం కూడా రమణబాబుతో పాటు మరికొందరి పేర్లతో ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ సర్వే కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో పేరాబత్తుల రాజశేఖర్‌ అభ్యర్థితత్వం వైపు టీడీపీ అధిష్ఠానం మొగ్గు చూపి ఆయన పేరును ఖరారు చేసింది. దాంతో కోనసీమతో పాటు గోదావరి జిల్లాల్లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. రాజశేఖర్‌ ఇప్పటికే తన వంతు ప్రయత్నంగా పట్టభద్రులైన ఓటర్లను చేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండటంతో పాటు వివిధ జిల్లాలోని టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. దీంతో రాజశేఖర్‌ విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలంతా ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రకటనతో ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలంలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com