ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణభయంతో ఇరాన్‌కు పారిపోయిన హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్.. ఎవరీ నయూమ్ ఖాసిమ్

international |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:50 PM

గత నెల రోజులుగా లెబనాన్‌‌లోని హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఆ గ్రూప్ డిప్యూటీ సెక్రటరీ జనరల్, సెకండ్-ఇన్-కమాండ్ నయీమ్ ఖాసిమ్ ప్రాణభయంతో ఇరాన్‌కు పారిపోయినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. యూఏఈకి చెందిన ‘ఇరెమ్ న్యూస్’ కథనం ప్రకారం.. నయీమ్ ఈ నెల 5నే బీరుట్‌ను విడిచిపెట్టాడంటూ ఇరాన్ వర్గాలను ఉటంకించింది. లెబనాన్, సిరియా పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగచి విమానంలోనే ఖాసిమ్ ఇరాన్ చేరుకున్నట్టు తెలిపింది. ఆయనను ఇజ్రాయేల్ హత్య చేసే అవకాశం ఉందన్న ఇస్లామిక్ రిపబ్లిక్ నేతల హెచ్చరికలతోనే లెబనాన్ వీడినట్టు వివరించింది.


సెప్టెంబర్ 27న ఇజ్రాయేల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ సయ్యద్ నస్రల్లా మృతిచెందిన తర్వాత ఖాసిమ్ మూడుసార్లు ప్రసంగించారు. అందులో ఒకసారి బీరుట్ నుంచి కాగా, రెండుసార్లు ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి మాట్లాడాడు. కాగా, ఏడాదికిపైగా సాగుతోన్న హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే హెజ్బొల్లా‌ చీఫ్ నస్రల్లా, వ్యవస్థాపక సభ్యుడు ఫౌద్ షుక్ర్‌తో పాటు కమాండర్ అలీ కర్కీ, సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్, డ్రోన్ యూనిట్ చీఫ్ మహమ్మద్ స్రూర్, మిసైల్ యూనిట్ చీఫ్ ఇబ్రహీమ్ ఖుబైసీ, ఆపరేషన్ కమాండర్ ఇబ్రహీమ్ అక్విల్, సీనియర్ కమాండర్ మహమ్మద్ నసీర్ సహా కీలక నేతలను ఇజ్రాయేల్ మట్టుబెట్టింది. దీంతో నస్రల్లా మృతి తర్వాత ఖాసిమ్ క్రియాశీలకంగా మారారు.


లెబనాన్‌లో షియాల అమల్ ఉద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఖాసిమ్.. ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషన్ కారణంగా 1979లో ఆ దేశాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత హెజ్బొల్లా స్థాపనకు దారితీసిన సమావేశాల్లో పాల్గొన్నారు. 1982లో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడిన తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతుతో హెజ్బొల్లా ఏర్పాటైంది. 1992లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగింది. ఆ ఏడాది పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది.


మరోవైపు, గతేడాది అక్టోబరు 7 నాటి హమాస్ మారణహోమానికి ప్రధాన సూత్రధారి యహ్వా సిన్వార్‌ను పది రోజుల కిందటే దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంంలో ఇజ్రాయేల్ మట్టుబెట్టింది. ఇదే సమయంలో లెబనాన్‌ రాజధాని బీరుట్ సహా పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా ఆర్దిక మూలాలపై దాడులకు వ్యూహరచన చేసినట్టు ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. హెజ్బొల్లా ఉగ్రవాద కార్యకలాపాల ప్రాంతాల్లో ఉండే పౌరులు తక్షణమే అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) అధికార ప్రతినిధి డానియల్ హగారీ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com