ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్‌లో పంజా విసిరిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:49 PM

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గండేర్బల్ జిల్లాలో గగంగీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఓ ప్రయివేట్ సంస్థ నిర్మాణ స్థలంలో జరిగిన ఈ ఘటనలో చనిపోయినవారిలో ఓ వైద్యుడు, ఐదుగురు భవన నిర్మాణ కూలీలు ఉన్నట్టు తెలిపారు. ముష్కరుల కాల్పుల్లో మరికొందరు గాయపడినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతర కార్మికులపై జరిగిన ఈ దాడి హేయమైందని, పిరికిపంద చర్య అని మండిపడ్డారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని శ్రీనగర్‌లోకి స్కిమ్స్‌కు తరలించాలని సూచించారు.


గుండ్ ప్రాంతంలో ఓ సంస్థకు చెందిన నిర్మాణ కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడిచేసి, కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో సొరంగ నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ అక్కడకు చేరుకుని ముష్కరుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్)‌లో పోస్ట్ చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు ‘గండేర్బల్‌లోని గగంగీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. తదుపరి వివరాలను వెల్లడిస్తాం% అని తెలిపారు.


ఉగ్రదాడిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. అమాయక కార్మికులు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నారని అన్నారు. ‘అమరులైన కార్మికులకు నివాళులర్పిస్తున్నాను.. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. క్షతగాత్రులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను’ అని గడ్కరీ ట్వీట్ చేశారు. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరిగి.. గతవారమే ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అక్టోబరు 16న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే ఉగ్రదాడి జరగడం గమనార్హం. కశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని భావిస్తోన్న తరుణంలో ఉగ్రవాదులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com