ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిక్కు అల్లర్లకు 40 ఏళ్లు.. నవంబర్‌లో ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:45 PM

ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. తాజాగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. నవంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని హెచ్చరికలు చేశాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ.. ఎయిరిండియా విమానాలపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం ప్రస్తుతం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే దేశంలో గత కొన్ని రోజుల నుంచి వరుసగా పదుల సంఖ్యలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


తాజాగా హెచ్చరికలు చేస్తూ.. గురుపత్వంత్ సింగ్ పన్నూ ఒక వీడియో విడుదల చేశాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు 40 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. ఈ హెచ్చరికలు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. అయితే గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ఈ హెచ్చరికలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో కూడా పన్నూ హెచ్చరికలు చేశాడు. విమానాలకు బాంబు బెదిరింపులే కాకుండా ఏకంగా మన దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకూ హెచ్చరికలు చేశాడు. నవంబరు 19వ తేదీన ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్టు మూతపడుతుందని.. దాని పేరును కూడా తాము మార్చేస్తామని గతేడాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఒక వీడియోను విడుదల చేశాడు.


2007లో సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ ప్రారంభం అయింది. అయితే దీని వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థను 2019లోనే భారత ప్రభుత్వం నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం గురుపత్వంత్‌ సింగ్ పన్నూను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. గురుపత్వంత్ సింగ్ పన్నూకు అమెరికాతోపాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.


ఇక అమెరికా గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందంటూ.. కొంతకాలం కింద అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో భారత మాజీ రా అధికారి వికాస్ యాదవ్ పాత్ర ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని చెక్ రిపబ్లిక్‌ దేశంలో అరెస్ట్ చేసి.. అమెరికాకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక పన్నూ హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలతో ఇప్పటికే భారత్‌కు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నోటీసులు కూడా జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com