ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాలకు బాంబు బెదిరింపులు.. రామ్మోహన్ నాయుడు సీరియస్, కేంద్రం సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:43 PM

గత కొన్ని రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో విమానాలకు బాంబు హెచ్చరికలు వస్తుండటం అటు ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సంస్థలతోపాటు ఇటు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. అవి ఎవరు చేస్తున్నారు.. అందులో ఎంతవరకు నిజం ఉంది అని కనుక్కోవడం ప్రస్తుతం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన బెదిరింపులు అన్నీ నకిలీవి అని గుర్తించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా విమానాలకు బెదిరింపులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సీరియస్‌ అయ్యారు.


విమాన ప్రయాణికులకు భద్రత కల్పించడమే తమ ప్రభుత్యానికి మొదటి ప్రాధాన్యత అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇక విమానాలకు బెదిరింపులు చేసేవారిని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చేలా ఇప్పటివరకు ఉన్న విమానయాన చట్టాలను సవరిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వచ్చిన విమాన బెదిరింపులు అన్నీ ఫేక్ అని తేలిందని చెప్పారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్‌ ఉందని.. దాన్నే అనుసరిస్తున్నట్లు పేర్కొ్న్నారు. అయితే విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినపుడు పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ విధివిధానాలను కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు.


అక్టోబర్‌ 14వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ బెదిరింపులపై సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. విమానయాన భద్రతా నిబంధనలను సవరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1982 సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ చట్టం సవరణకు వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. విమానాలకు బెదిరింపులు రావడంతో వాటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రతి బెదిరింపును క్షుణ్ణంగా విశ్లేషించి వేగంగా, అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.


అయితే ఇవి తప్పుడు బెదిరింపు కాల్స్‌ అయినా.. ప్రయాణికుల భద్రత, సురక్షిత విషయంలో రాజీ పడటం లేదని.. ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విమానాలకు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రోజున 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఆదివారం మరో 24 విమానాలకు అలాంటి బెదిరింపులు వచ్చాయి.


  ఇక ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌ సహా దాదాపు అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలతోపాటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ కూడా ఈ బెదిరింపులు వచ్చిన విమానాల జాబితాలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇండిగో, విస్తారా, ఎయిరిండియాకు చెందిన ఆరు చొప్పున విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ బాంబు హెచ్చరికల గురించి అధికారులకు తెలిపామని.. వారి ఆదేశాల మేరకు భద్రతా విధానాలను పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్‌ అని అధికారులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com