ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పోలీసులకు శుభవార్త.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులక తీపికబురు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తున్నానని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు అన్నారు. పోలీసులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారన్నారు. పోలీసుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యతని.. ప్రతి ఏటా రూ.20 కోట్లు పోలీసు శాఖకు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తామని.. అమరావతిలో శాశ్వత అమరవీరుల సంస్మరణ స్థూపం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలు చేపడతామన్నారు.


రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. వాహనాలతో పాటు పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామన్నారు. దేశంలోనే ఏపీ పోలీసు అంటే మోడల్‌గా తీర్చిదిద్దాలని ముందుకెళ్లామని.. 2014-2019 మధ్య రూ.600 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. అందులో పోలీసు సంక్షేమానికి రూ.55 కోట్లు కేటాయించామన్నారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించామన్నారు సీఎం.


దేశానికి, రాష్ట్రానికి పోలీస్ శాఖ చాలా కీలకం అన్నారు ముఖ్యమంత్రి. రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తారని.. పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడుకుందని వ్యాఖ్యానించారు. 24 గంటలూ పని చేసే ఏకైక శాఖ పోలీసు శాఖ.. వారికి పండగలు ఉండవు, ఎప్పుడూ విధుల్లోనే ఉంటారన్నారు. విజయవాడ వరదలు, తిరుమల బ్రహ్మోత్సవాలు, విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో పోలీసులు సేవలు అందించారన్నారు. నేరాల తీరు మారుతోందని.. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని సూచించారు చంద్రబాబు.


రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారని.. ప్రతి కేసును సవాల్‌గా తీసుకుంటాం.. ఛేదిస్తామన్నారు. ఆడబిడ్డలు అప్రమత్తంగా ఉండాలని.. నేరస్థులకు చట్టపరమైన శిక్షపడేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అన్నారు. హిందూపూర్ అత్యాచారం, కడపలో యువతి హత్య కేసులో నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆడబిడ్డల రక్షణే ప్రభుత్వ లక్ష్యమని.. ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. రాష్ట్రంలో జీరో క్రైమ్ నమోదు కావాలని.. శాంతి, భద్రతలు మొదటి ప్రాధాన్యతగా పనిచేయాలన్నారు. ఎవరైనా నేరం చేయాలనే ఆలోచన వస్తేనే భయపడాలి అన్నారు సీఎం. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com