ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా టూర్‌కు ముందు బెంగాల్ త‌ర‌ఫున రంజీ ట్రోఫీ బ‌రిలోకి ష‌మీ

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 04:38 PM

గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో గాయ‌ప‌డిన టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఎట్ట‌కేల‌కు పూర్తిగా కోలుకున్నాడు. ఈ మేర‌కు ష‌మీ సోమ‌వారం ఒక సందేశాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇప్పుడు తాను వంద‌కు వంద‌శాతం ఎలాంటి నొప్పి లేకుండా ఫిట్‌గా ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. ఆదివారం నాడు బెంగళూరులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ముగిసిన తర్వాత షమీ నెట్స్‌లో చెమ‌టోడ్చాడు. ఈ సంద‌ర్భంగా పూర్తి సెషన్ బౌలింగ్ వేయ‌డం త‌న‌కు సంతృప్తిని ఇచ్చింద‌ని పేర్కొన్నాడు. ఇక గ‌తేడాది చీలమండ గాయం కారణంగా స‌ర్జ‌రీ చేయించుకున్న ష‌మీ అప్ప‌టి నుంచి పూర్తిగా క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. ఇటీవ‌లే ప్రాక్టీసు మొదలుపెట్టాడు.అయితే, మ‌ళ్లీ అత‌ని మోకాళ్లలో వాపు వచ్చిందని, ఇది ష‌మీ జ‌ట్టులో పునరాగ‌మ‌నంపై ప్రభావం చూపించే అవ‌కాశం ఉందంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవ‌ల వెల్ల‌డించాడు. హిట్‌మ్యాన్ అలా చెప్పిన రోజుల వ్య‌వ‌ధిలోనే తాజాగా ష‌మీ తాను పూర్తిగా కోలుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. "నిన్న బౌలింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కేవ‌లం హాఫ్ రన్అప్‌తో బౌలింగ్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ వ‌ర్క్‌లోడ్ తీసుకోకూడదనుకున్నాను. కానీ, నిన్న నేను పూర్తిగా స్థాయిలో మునుప‌టి ష‌మీలా బౌలింగ్ చేయాల‌ని నిర్ణయించుకున్నాను. మంచి స్పీడ్‌తో బౌలింగ్ వేశాను. ఫలితం బాగుంది. ప్ర‌స్తుతం నేను 100 శాతం నొప్పి లేకుండా ఉన్నాను. ఆస్ట్రేలియా సిరీస్‌కి అందుబాటులో ఉంటానా లేదా అని చాలా కాలంగా అందరూ ఆలోచిస్తున్నారు. అయితే దానికి ఇంకా కొంత సమయం ఉంది" అని 'యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్' ఈవెంట్ సందర్భంగా విలేకరులతో ష‌మీ చెప్పాడు.ఇక కీల‌క‌మైన ఆస్ట్రేలియా టూర్‌కు ముందు షమీ తన రాష్ట్ర జట్టు బెంగాల్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. త‌ద్వారా త‌న ఫిట్‌నెస్ లెవెల్‌పై ఒక అంచ‌నాకు రావ‌చ్చ‌ని అన్నాడు. ఇక ష‌మీ తాజా సందేశంతో భార‌త క్రికెట్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. స్టార్ పేస‌ర్ కోలుకోవ‌డం టీమిండియాకు క‌లిసి వ‌స్తుంద‌ని, ఆసీస్ గ‌డ్డ‌పై భార‌త్‌కు ఎదురులేకుండా ఉంటుంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com