ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఎమ్మెల్యే మీటింగ్‌కు వైసీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 06:46 PM

ఏపీ రాజకీయాలను అంచనా వేయలేని పరిస్థితి. ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటాయో తెలియదు. అన్నిచోట్లా రాజకీయాలు దాదాపుగా అలాగే ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు సంగతిలోకి వస్తే.. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వైఎస్ జగన్ బంధువులు సైతం ఆ పార్టీని వీడారు. అయితే నేతలతో పాటుగా కేడర్ వెళ్లకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.


రాజోలు మాజీ ఎమ్మె్ల్యే, వైసీపీ నేత రాపాక వరప్రసాద రావు.. జనసేన పార్టీ కార్యక్రమంలో కనిపించడం ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. మలికిపురంలో జరిగిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో జనసేన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి రాపాక వరప్రసాద్ రావు కూడా రావటం విశేషం. అయితే రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను రాపాక వరప్రసాద్ కలవడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. దీంతో రాజోలు నియోజకవర్గంలో దీనిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.


మరోవైపు 2019 ఎన్నికల సమయంలో రాపాక వరప్రసాద రావు జనసేన తరుఫున రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక కావడం విశేషం. అయితే కొన్ని రోజులకే ఆయన వైసీపీ వైపు చేరిపోయారు. అయితే 2024 ఎన్నికల సమయంలో రాజోలు నుంచి వైసీపీ టికెట్ ఆశించిన రాపాకకు భంగపాటు ఎదురైంది. 2019 ఎన్నికల్లో రాపాక చేతిలో ఓటమిపాలైన గొల్లపల్లి సూర్యారావు.. 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిపోయారు. ఆయనకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ కేటాయించారు. అయితే రాపాక వరప్రసాద్‌ను అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి రెండు చోట్లా ఓటమి ఎదురైంది.


రాజోలు అసెంబ్లీకి పోటీచేసిన గొల్లపల్లి సూర్యారావుతో పాటుగా అమలాపురం ఎంపీ పదవికి పోటీచేసిన రాపాక కూడా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి కాస్త సైలెంట్‌గా ఉన్న రాపాక.. ఇటీవల కాలంలో రెండుసార్లు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం జనసేన కార్యకర్తల సమావేశంలోకి వెళ్లి మరీ కలవటంతో అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను కలవడానికి రాజకీయ కారణాలేవీ లేవన్న రాపాక.. నియోజకవర్గ పనుల కోసమే ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసినట్లు చెప్పారు. అయితే ఆయన పార్టీ మారతారేమోననే ఊహాగానాలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. టీడీపీలోకి వెళ్లేందుకు కూటమి నేతలతో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com