ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మందుబాబులకు షాక్.. ఈ లిక్కర్ బాటిళ్ల ధర పెంపు, ఉత్తర్వులొచ్చాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 07:19 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలపై చట్ట సవరణ చేసింది.. విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్‌ ఫీజును పెంచింది. దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక చట్టసవరణ చేయగా.. ఈమేరకు అదనపు ప్రివిలేజ్‌ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ చట్ట సవరణను‌ ఆమోదించడంతో.. ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 కనుక ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్‌ ఫీజు ఉంటుంది.


విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా.. తదుపరి పది రూపాయలకు పెంచారు. ఒకవేళ క్వార్టర్ బాటిల్ ధర రూ.90.50 గా ఉంటే ఎపీఎఫ్ (ప్రివిలేజ్ ఫీజ్) కలిపి దాని ధర రూ రూ.100 అవుతుంది. అయితే ప్రభుత్వ ఆదేశాలతో క్వార్టర్ బాటిల్ ధర రూ. 99 కే నిర్ధారించడంతో.. రూ. 100 ధరలో రూ.1 మినహాయించి విక్రయిస్తారు.


మరోవైపు రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలతో గడువు ముగియగా.. 90వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తలుస్తోంది. నాన్‌రిఫండబుల్‌ రుసుముల రూపంలో రూ.1,800 కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 3,396 షాపులకు ఈ దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారమే 24వేలకుపైగా దరఖాస్తులు రావడం విశేషం. అంటే రాష్ట్రంలో సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చినట్లు లెక్క చెబుతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో మద్యం షాపులకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 షాపులకు రాష్ట్రంలోనే అత్యధికంగా 5,787 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లా వత్సవాయి మండలంలోని 96వ నంబరు షాపునకు 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు రావడం విశేషం. ఈ మూడు షాపులు ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో డిమాండ్ పెరిగింది అంటున్నారు. ఏలూరు జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 37, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో సగటున ఒక్కో దుకాణానికి 34 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఒక్కో షాపునకు సగటున 30 దరఖాస్తులు అందాయి.


అలాగే కాకినాడ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో సగటున ఒక్కో దుకాణానికి లో 16 చొప్పున, బాపట్ల జిల్లాలో 17, అన్నమయ్య జిల్లాలో 19, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 20, కాకినాడ, చిత్తూరుల్లో 21 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో సగటున ఒక్కో దుకాణానికి 23 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలో నాలుగు షాపులకు రెండేసి దరఖాస్తులే వచ్చాయి. మూడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోనివి కాగా.. మరొకటి కడప‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి. తాడిపత్రిలోని పది షాపులకు మూడేసి దరఖాస్తులు వచ్చాయి.. అలాగే కమలాపురంలోని కూడా 4 షాపులకు మూడు దరఖాస్తులే వచ్చాయి. తాడిపత్రిలోని రెండు షాపులకు, చంద్రగిరి నియోజకవర్గంలోని మూడు షాపులకు నాలుగేసి దరఖాస్తులు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com