ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే.. జేసీ ప్రభాకర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 06:44 PM

ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ. తాడిపత్రిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చునన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాను అడ్డుకోనని స్పష్టం చేశారు. అవసరమైతే తాను కూడా వారి వ్యాపారంలో పెట్టుబడి పెడతానన్నారు. ఇక ఇసుక వ్యాపారం, మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి మండలం నుంచి రూపాయికి 15 పైసలు చొప్పున కమిషన్ ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పెట్టుబడి పెడతానని.. 20 పైసలు ఇవ్వాలని అన్నారు. అయితే తాను ఈ డబ్బుతో తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఈ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.


ఈ వీడియోలో ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎమ్మెల్యేలంటే గౌరవమని.. వారిని ఎంతో గౌరవిస్తానని అన్నారు. అయితే తన తాడిపత్రి నియోజకవర్గంలో వేలుపెడితే మాత్రం సహించేది లేదన్నారు. తన నియోజకవర్గంలోకి ఎలా వస్తారని ప్రశ్నించిన జేసీ.. తామేమైనా వారి నియోజకవర్గంలో జోక్యం చేసుకున్నామా అంటూ ప్రశ్నించారు. ఇసుక రీచ్‍లు, మద్యం దుకాణాలు తమకు ముఖ్యం కాదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధే తమకు ప్రాధాన్యమన్నారు. దీనికోసం ఇప్పటికే బ్యాంకులో రూ.3 కోట్లు ఉన్నాయని చెప్పారు. తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. 1952 నుంచి తాడిపత్రి ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారన్న జేసీ.. తాడిపత్రి ప్రజల అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధమన్నారు.


మరోవైపు ఉచిత ఇసుక విషయంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మద్యం దుకాణాల విషయంలోనూ కమిషన్ ఇవ్వాలని బాహాటంగా చెప్పడం వివాదాస్పదమవుతోంది. ఇక అక్టోబర్ 16 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా 89882 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 1700 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. రేపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ తీయనున్నారు. ఇందులో లిక్కర్ షాప్ లైసెన్సులు దక్కించుకున్న వారికి అక్టోబర్ 15లోగా షాపులు అందజేస్తారు. అక్టోబర్ 16 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం విక్రయాలు జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com