ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అంగతకుడు చేసిన పోస్టు కలకలం రేపింది. ఈనెల 4న స్వామివారి బ్రహ్మోత్సవాల తొలిరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించడం దేవుడికి సైతం ఇష్టం లేనట్లు ఉందని, ఆయనకు కచ్చితంగా ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా స్వామివారి పట్టువస్త్రాల వీడియోను ట్వీట్ చేయడంపై టీటీడీ ఆగ్రహించింది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఆ వీడియోపై సీరియస్ అయ్యింది. దీనిపై తిరుపతి వన్ టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. చైతన్య అనే వ్యక్తి తన Blind Man అనే ట్విటర్ ఎకౌంట్లో స్వామివారి ప్రతిష్ఠ దిగజార్చేలా వీడియో పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సీఎం చంద్రబాబుకు సైతం ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపారు. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు 196, 298, 299, 353(2) r/w BNS సెక్షన్ల కింద ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చైతన్యతోపాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.