ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు బతకాలని లేదు..ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ సెల్ఫీ వీడియో కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 08:37 PM

ఏపీలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ శాఖల్లో అక్రమాల వ్యవహారం కలకలం రేపుతోంది. చిలకలూరిపేట, నరసరావుపేట సహా విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్‌ నరేష్‌ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తాను మోసపోయానని.. బతకాలని లేదన్నారు. తాను మోసపోయానని.. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని, ఉన్నతాధికారులతో పాటుగా బ్యాంకు సిబ్బంది తననే తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేశారు. బ్యాంక్‌ కస్టమర్లను మోసం చేసే ఉద్దేశం తనకు లేదని.. బంగారం రుణాలకు సంబంధించి కొందరి పేర్లు మాత్రమే మార్చామని.. ఎలాంటి మోసం చేయలేదని చెప్పుకొచ్చారు.


బ్యాంక్‌లో అకౌంట్‌లు ఉన్నవారికి ప్రతి నెలా వడ్డీ సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నామని.. తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు నరేష్. విజయవాడ భారతి నగర్ బ్రాంచ్‌కు వెళ్లిన అనంతరం.. అక్కడ జోనల్ హెడ్ కారణంగా గత రెండు నెలలుగా బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేటలోని బ్యాంకు ఉద్యోగులందరికీ అన్ని విషయాలు తెలుసని వీడియోలో వివరించారు. ఇంత జరిగితే.. తనను మాత్రమే దోషిగా నిలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే అధికారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నరేష్ వీడియోలో చెప్పారు. అలాగే తాను జోషి, పిల్లలను చూసి ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బు వస్తే మొత్తం సర్దుబాటు చేసి తప్పుకోవాలనుకున్నాను అన్నారు. కానీ తనను మోసం చేశారన్నారు. అందరూ డబ్బు తీసుకున్నారు కానీ ఇప్పుడు తనను మాత్రమే తప్పు పడుతున్నారని.. ఇక తనకు బతకాలని లేదని చనిపోదామనుకుంటున్నట్టు వీడియోలో చెప్పుకొచ్చారు.


పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ విచారణ చేపట్టింది.. ప్రధానంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో మోసాలపై చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. బ్యాంక్‌లో ఎఫ్‌డీలు దారి మళ్లించడంపై ఆరా తీశారు. రెండు నెలలుగా బాధితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించారు. ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల బాండ్లు చెల్లవని.. అందులో డబ్బులు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించగా.. కేసును సీఐడీకి అప్పగించారు. అంతేకాదు మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అండగా నిలిచారు. బాధితులకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులను ఆయన కోరారు. రాష్ట్రంలో ఐసీఐసీఐ బ్యాంక్లుల్లో అవతవకల వ్యవహారం సంచలనంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com