ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. రూపాయి కూడా కట్టొద్దు, ఇకపై పూర్తిగా ఉచితం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:52 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నును రద్దు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చెత్త పన్ను రద్దుపై కీలక ప్రకటన చేశారు. ప్రజలకు చెత్త పన్ను నుంచి విముక్తి కల్పిస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేయడం వల్ల పట్టణ ప్రజలపై ఏటా రూ.170 కోట్ల భారం తప్పింది. గత ప్రభుత్వం మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో 50 చోట్ల ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేస్తోంది. ఏటా రూ. 170 కోట్ల మేర వినియోగ రుసుములు వసూలవుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయడంతో.. ప్రజలకు పెద్ద ఊరటే దక్కిందని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ నిర్వహణకు అవసరాన్ని బట్టి ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.


చెత్త పన్ను రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రజల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయకుండానే పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు సిద్ధమవుతోంది. దీని కోసం ఎస్‌డబ్ల్యూఎం నిబంధనల్లో కొన్ని సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్త తరలింపు కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న ఆటోలను పక్కన పెట్టి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ కార్మికులతో వీధులు శుభ్రం చేయించడంతోపాటు చెత్త సేకరించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.


గత ప్రభుత్వం హయాంలో.. రాష్ట్రవ్యాప్తంగా 40 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు.. 2021 అక్టోబరు నుంచి ప్రతి నెలా వినియోగ రుసుముల వసూళ్లను మొదలుపెట్టారు. అప్పటి నుంచి 32 చోట్ల రూ.30, రూ.40-90, మరో 8 చోట్ల రూ.40-60, గరిష్ఠంగా రూ.100-120 వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఏటా రూ. 170 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. ఈ రుసుములపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రాగా.. ఆందోళనలకు దిగినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటూ చెత్త పన్నును రద్దు చేశారు.


మరోవైపు ఏపీ కేబినెట్‌లో కూడా చెత్త పన్ను అంశం చర్చకు రానుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో చెత్త పన్ను రద్దు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 2న కూడా చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేబినెట్‌లో చెత్త పన్ను అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com