ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ వీడనున్న ఆమ్రపాలి.. ఆ ఐఏఎస్‌లు కూడా.. కేంద్రం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 06:45 PM

తెలంగాణలోని ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రాస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి సహా 11 మంది ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేయనున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.


అయితే వీరంతా తమకు తెలంగాణ కేడర్ కావాలని గతంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం.. సొంత రాష్ట్రాలకు వెళ్లాలని సూచించింది. వెంటనే సొంత రాష్ట్రాలకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి కాట, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ రోనాల్డ్ రాస్ ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది.


మరోవైపు ఐఏఎస్ ఆమ్రపాలిని విభజన సమయంలో ఏపీకి కేటాయించారు. అయితే తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని ఆమ్రపాలి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఖండేకర్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆమ్రపాలి.. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.


1982 నవంబర్ 4వ తేదీన ఆమ్రపాలి విశాఖపట్నంలో జన్మించారు. అక్కడే సాయి సత్య మందిర్‌లో ప్రాథమిక విధ్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ చెన్నైలో బీటెక్ పూర్తిచేసిన ఆమ్రపాలి.. బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ చదివారు. ఎంబీఏ తర్వాత ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్‌లో కొద్దికాలం పనిచేశారు. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన ఆమ్రపాలి.. 2010 యూపీఎస్సీ పరీక్షల్లో 39వ ర్యాంక్ సాధించారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా వ్యవహరించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమ్రపాలి తిరిగి తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com