ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా.. వెల్లడించిన ఫరూక్ అబ్దుల్లా

national |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:28 PM

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ తెరపైకి వస్తోంది. కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి.. మెజార్టీ మార్కును దాటి స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నేషనల్ కాన్ఫరెన్స్ అవతరించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా తన కుమారుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫరూక్ అబ్దుల్లా తేల్చి చెప్పారు.


జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి అనుకూలంగా వచ్చిన వేళ.. ఆ రాష్ట్ర సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు తమ తీర్పును తెలియజేశారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.


జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని 2019లో రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 5వ తేదీన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం లేదని జమ్మూ కాశ్మీర్ జనం స్పష్టంగా తెలిపారని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లానే అని తేల్చి చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.


జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్ 46. ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 49 స్థానాల్లో విజయం, ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 29 స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉంది. ఇక పీడీపీ 3, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యం, గెలుపులో ఉన్నారు. ఇక కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి మెజార్టీ మార్కుకు అవసరం అయిన స్థానాలు రావడంతో అధికార ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తోంది.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ కూటమి నెగ్గుతుందా? కాంగ్రెస్ కూటమికే అధికారం దక్కుతుందా? అని ఆరా తీశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాయి. కాశ్మీర్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చంఢీగఢ్‌, అండమాన్ నికోబార్‌లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com