ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఇవే.. ఎగ్జిట్ పోల్స్‌ కూడా పట్టలేదు!

national |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:24 PM

10 ఏళ్లుగా హర్యానాలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ.. ఈసారైనా పీఠం దక్కించుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసింది. హస్తం పార్టీ ఉత్సాహనికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తోడుకావడంతో ఆ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. దీనికితోడు ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం కనబరచడంతో విజయం తమదేనని హస్తం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి.. తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ.. అత్యధిక స్థానాలు గెలుచుకుని.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించి.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


హర్యానా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు.. పరాజయానికి ఒక కారణం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మాజీ సీఎం భూపింద్ర సింగ్ హుడా, ఎంపీ కుమారి సెల్జా మధ్య ఆధిపత్య పోరు.. పార్టీకి చేటు తెచ్చిందని చెబుతున్నారు. అదే సమయంలో సీఎం పదవికి తానే బలమైన పోటీదారురాలు అని కుమారి సెల్జా ప్రకటించారు. మరోవైపు.. ఎన్నికల వేళ కుమారి సెల్జాపై భూపింద్ర సింగ్ హుడా అనుచరుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర దుమారానికి కారణం అయింది. దీంతో కుమారి సెల్జా ప్రచారానికి దూరంగా ఉండగా.. ఎన్నికల ప్రచార సభకు హాజరైన రాహుల్ గాంధీ ఆమెను వేదికపైకి తీసుకొచ్చి భూపింద్ర హుడాతో షేక్ హ్యాండ్ ఇప్పించినా.. వారి మధ్య వార్ కొనసాగింది.


హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందు నుంచే బీజేపీ ప్రచారంలో మునిగిపోగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అభ్యర్థుల ఎంపిక, కసరత్తు, తుది జాబితా అంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఎన్నికలకు సంబందించి కాస్త ఆలస్యంగానే ప్రచారంలోకి దిగడం కూడా పార్టీకి ఎదురుదెబ్బగా మారింది.


అనవసర వ్యాఖ్యలు


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముందుగా తన ఇంటిని నింపుకుంటానని అసాంధ్ కాంగ్రెస్ అభ్యర్థి షంషేర్ గోగి ఓ ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఇక షంషేర్ గోగి చేసిన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతుందని బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. అయితే జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోలేకపోవడం


హర్యానా ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో గతంలో ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే వాటిని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది. రైతులు, రెజ్లర్లు, సైనికుల సమస్యలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌పై భారీ ఖర్చుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ.. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది. మరోవైపు.. కోటా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బహిరంగంగా ప్రకటనలు చేయడం కూడా పార్టీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపించింది. ఇక లోక్‌సభ ఎన్నికల తరహాలో రాజ్యాంగం అనే అంశాన్ని ఉపయోగించుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నించడం హర్యానాలో పనిచేయలేదు.


పవర్ సెంటర్‌గా భూపిందర్‌ సింగ్‌ హుడా


హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా.. కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానే కావడం అంతర్గత పోరుకు దారి తీసింది. టికెట్ల పంపిణీ నుంచి ప్రచారానికి సంబంధించి అన్ని విషయాల్లో కాంగ్రెస్ హైకమాండ్ భూపిందర్‌ సింగ్‌ హుడాకు.. పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలనే తీసుకున్న వ్యూహం కూడా బెడిసికొట్టింది. ఎంపీలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కుమారి సెల్జా కొన్ని స్థానాల్లో మాత్రమే ప్రచారం చేశారు.


గూగుల్ ట్రెండ్స్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు


హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చినా.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కూటమే విజయం సాధిస్తుందని చెప్పినా ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నాయి. హర్యానా ఫలితాలు, అలా రావడానికి గల కారణాల గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. దీంతో హర్యానా ఎన్నికల ఫలితాలు గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాయి. హర్యానాతో పాటు చంఢీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఫలితాల గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com