ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడికి సీబీఐ పేరుతో నరకం చూపించిన సైబర్ నేరగాళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:08 PM

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిపై సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. సైబర్‌ పోలీసుల పేరుతో ఫోన్ చేసి.. ఆయన వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే అన్నట్లు నమ్మించారు. వీడియో కాల్‌ విచారణ పేరిట హడావుడి చేసిన కేటుగాళ్లు.. కేసు నుంచి బయటపడాలంటే రూ. 15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ఇది సైబర్ ముఠా పనిగా అనుమానం రావడంతో సోమవారం నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో వాకాటి ఫిర్యాదు చేశారు. గత నెల 27 నుంచి పలుసార్లు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపారు.


సెప్టెంబరు 27 ఉదయం 8 - 9 గంటల మధ్య వాకాటి నారాయణరెడ్డికి గుర్తుతెలియని ఓ నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను పన్‌షుల్‌ అగర్వాల్‌‌గా పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ఓ పార్సిల్‌ను ముంబయి నుంచి థాయిలాండ్‌కు పంపారని, అందులో పాస్‌పోర్టు, బ్యాంకు కార్డులతోపాటు 200 గ్రాముల డ్రగ్స్‌ ఉన్నాయని చెప్పాడు. అయితే, తాను ఎలాంటి పార్సిల్ పంపలేదని వాకాటి బదులిస్తే. మీ ఆధార్‌కార్డు వివరాలతో ఎవరైనా పంపి ఉంటారని.. మీ కాల్‌ సైబర్‌క్రైమ్స్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాను.. ఫిర్యాదు చేయాలని అన్నాడు.


అతడి మాటలు నిజమేనని నమ్మిన నారాయణరెడ్డి.. రవిచంద్ర అనే వ్యక్తికి ఫిర్యాదు చేశారు. వీడియో కాల్‌ ద్వారానే ఆధార్‌ వివరాలు తెలుసుకున్న అతడు.. కాసేపటి తర్వాత మీపై మనీ లాండరింగ్‌ కేసులు, సీబీఐ కేసు ఉందని తెలిపాడు. అయితే, అవన్నీ వ్యాపార కేసులని, ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్నాయని వాకాటి చెప్పారు.. అయితే, మీ పేరుతో ముంబయిలో బ్యాంకు అకౌంట్ ఉందని, అందులోకి 43 మిలియన్ల డాలర్లు వచ్చాయన్నాడు. తనకు ఖాతా లేదని నారాయణరెడ్డి చెబితే.. మీ ఆధార్, కేవైసీ దుర్వినియోగమై ఉండొచ్చని, వెరిఫికేషన్‌ పూర్తయ్యే వరకు సెల్ఫ్‌ కస్టడీలో ఉండాలని నమ్మబలికాడు.


అంతేకాదు, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, గది నుంచి బయటకు వెళ్లవద్దని చెప్పడంతో ఆయన అక్కడే ఉండిపోయారు. రెండు రోజుల తర్వాత.. మళ్లీ ఫోన్‌ చేసి.. అదే తరహాలో వివిధ పేర్లు.. వివిధ అంశాలతో బెదిరిస్తూ.. మీరు దీన్ని నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తనకు ముంబయిలో ఎటువంటి బ్యాంకు ఖాతాలేదని, నవాబ్‌ మాలిక్‌ అనే వ్యక్తి ఎవరో తెలియదని వాకాటి స్పష్టం చేశారు. అంతేకాదు, తాను దాదాపు పదేళ్లుగా ముంబయి రాలేదని, ఇప్పటికే వ్యాపారాల్లో నష్టపోయా.. మీరు అడిగిన డబ్బు ఇవ్వలేనని తెగేసి చెప్పడంతో ప్లేట్ మార్చారు.


మిమ్మల్లి కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తామని, పార్టీకి దూరం చేయడమే కాదు. ప్రజలు అసహ్యించుకునేలా చేస్తామని బెదిరించారు. తర్వాత అసిస్టెంట్‌ మానిటరింగ్‌ అధికారినంటూ మరో వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు. ఇప్పటి వరకు మీ గురించి మంచిగా చెప్పి అధికారి, ఇప్పుడు అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని, టాడా చట్టం కింద కేసు పెట్టాలని ఫైల్‌ తయారు చేస్తున్నట్లు బెదిరించాడు. అక్టోబరు 10న ముంబయి రావాలని, లేకుంటే మీ లైఫ్‌ రిస్క్‌లో పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ వరకు ఎప్పటికప్పుడు వారికి సమాచారం ఇచ్చిన వాకాటి.. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com