ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కీలక ప్రకటన

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:14 PM

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.ఇందుకోసం పాకిస్థాన్‌లో భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని స్టేడియంలలో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే, ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. చాలా కాలంగా ఇరు దేశాలు పరస్పరం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. అదే సమయంలో, ఆసియా కప్‌నకు కూడా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. ఈ కారణంగా, ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం కూడా ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్‌కు వస్తుందని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కీలక ప్రకటన చేశారు.ఆసియా కప్ కోసం భారత్ చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పటి నుంచి తీవ్రవాద కార్యకలాపాల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించగా, ఆ ప్రభావం క్రీడారంగంపైనా కనిపించింది. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి కూడా నిషేధించారు. పాకిస్థాన్‌కు వెళ్లకూడదన్న భారత్ వైఖరిని పరిశీలిస్తే, గతేడాది ఆసియా కప్‌లానే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే, పీసీబీ చీఫ్ అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చారు. టోర్నమెంట్ కోసం భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్‌కు వస్తుందని చెప్పారు.


ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ రాకపై పీసీబీ చీఫ్ ఏమన్నారంటే?
లాహోర్‌లో విలేకరులతో మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. “భారత జట్టు రావాలి. వారు ఇక్కడికి రావాలనే తమ ప్రణాళికలను రద్దు చేస్తారని లేదా వాయిదా వేస్తారని నేను అనుకోను. పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లకు మేమం ఆతిథ్యం ఇస్తామని నేను విశ్వసిస్తున్నాను. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియంలు కూడా సిద్ధంగా ఉన్నాయి. నిర్ణీత సమయం మేరకు టోర్నమెంట్ నిర్వహిస్తాం.”


ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. తుది షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికీ, పీసీబీ తన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. అయితే, ఐసీసీ షెడ్యూల్‌ను ఎప్పుడు ప్రకటిస్తుందో, పాకిస్థాన్‌కు వెళ్లే విషయంలో భారత జట్టు వైఖరి ఏమిటో తెలియాల్సి తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com