ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపిన దుండగుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 06:45 PM

అన్నమయ్య జిల్లా ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి అదృశ్యం విషాదాంతమైంది. కిడ్నాప్ చేసిన వ్యక్తి చేతిలో ఆమె హత్యకు గురైంది. పది రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోగా.. తాజాగా ఆమె మృతి చెందినట్లు తేలింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్‌ చేసి హత్య చేనిట్లు నిర్ధరణ అయింది. డబ్బుల వ్యవహారంలోనే ఈ కిడ్నాప్, హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.


వివరాల్లోకి వెళితే.. ధర్మవరం వన్‌టౌన్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర ప్రసాద్‌ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని ఓ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటుంది. గత నెల 29న ఉదయం 10 గంటలకు ఆమె తన ఎదురింట్లో ఉంటున్న వెంకటేశ్‌ అనే వ్యక్తితో కలిసి బయటకు వెళ్లింది. దైవ భక్తి ఎక్కువగా ఉండే స్వర్ణ కుమారి పుంగనూరు రోడ్డులో ఉన్న ఓ స్వామి వద్దకు వెంకటేష్ బైక్‌పై వెళ్లింది. అయితే అదే అదనుగా వెంకటేశ్‌ ఆమెను కిడ్నాప్‌ చేశాడు. అనంతరం మదనపల్లి టూటౌన్‌ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు.


సాయంత్రమైనా స్వర్ణకుమారి ఇంటికి రాకపోవటంతో ఇరుగు పొరుగువారు ఆమెకు ఫోన్ చేశారు. అయినా ఆమె స్పందించలేదు. దైవభక్తి ఎక్కువగా ఉండటంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని భావించింది. అయితే రెండ్రోజులైనా ఆమె ఇంటికి రాకపోవటంతో ఈ విషయాన్ని కుమారుడు నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్ చేసి చెప్పారు. హుటాహుటిన మదనపల్లెకు వచ్చిన సీఐ నాగేంద్ర ప్రసాద్.. తన తల్లి ఆచూకీ కోసం గాలించారు. ఎక్కడ ఆమె ఆచూకీ లభించకపోవటంతో మదనపల్లె టూ టౌన్‌ పీఎస్‌లో మిస్సింగ్ కంఫ్లైంట్ ఇచ్చాడు. కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకన్నారు.


అతడిని విచారించగా.. స్వర్ణకుమారి వద్ద భారీగా డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు చెప్పాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని ఆమె ఒత్తిడి తేవటంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లెలోనే పాతి పెట్టినట్లు తెలిపాడు. అతడిని క్రైం స్పాట్‌కు తీసుకెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది. అందరికీ రక్షణగా ఉండే పోలీసుల కుటుంబ సభ్యులకే రక్షణ లేకపోవటం ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com