ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి గరుడ సేవకు వెళ్తున్నారా.. టీటీడీ కీలక సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 05:58 PM

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ స్వామివారు వాహన సేవలలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ముఖ్యమైన శ్రీవారి గరుడ వాహన సేవ.. రేపు జరగనుంది. అక్టోబర్ 8వ తేదీ జరిగే ఈ వేడుక కోసం శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మలయప్పస్వామిని గరుడ వాహనంపై చూసి తరించేందుకు నిరీక్షిస్తున్నారు. గరుడ సేవ సందర్భంగా తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగనున్నాయి. సుమారుగా మూడున్నర లక్షల మంది గరుడ సేవలో పాల్గొనేందుకు తిరుమలకు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటోంది.


మరోవైపు శ్రీవారి గరుడ సేవ కోసం తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ పలు కీలక సూచనలు చేసింది. కొండపైకి ఎక్కువ వాహనాలను అనుమతించడం లేదని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు, అలాగే భక్తుల సౌకర్యం కోసం ఏపీఎస్‌ఆర్టీసీ 400కిపైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తంగా 3 వేల ట్రిప్పులు నడపనున్నట్లు వివరించారు. భక్తుల భద్రత కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో.. 1500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్‌ సిబ్బంది గరుడ సేవ కోసం పనిచేస్తారని తెలిపారు. భక్తుల కోసం ముఖ్యమైన కూడళ్లల్లో డిస్ ప్లే బోర్డులు పెట్టామని.. క్యూలైన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గరుడ వాహన సేవ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 11 వరకూ కొనసాగుతుందని తెలిపారు,


గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో ఉండే భక్తులను సుపథం, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. భక్తులు లగేజీ తీసుకెళ్లకుండా ఈ పాయింట్లలోకి ప్రవేశించాలని కోరింది. ఇవాళ్టి రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించలేదని స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సుల ద్వారా మూడు లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌లు అందిస్తున్నట్లు తెలిపింది. శ్రీవారి భక్తులకు వైద్య సేవల కోసం మాడ వీధుల్లో మొబైల్ క్లినిక్‌లు, 12 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నప్రసాదం, తాగు నీరు ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com