ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ బరితెగించిన చైనా.. సరిహద్దుల్లోకి డ్రాగన్‌ డ్రోన్లు.. నిఘా కోసమేనా

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 07:41 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల కొన్ని డ్రోన్లు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. భారత్‌-చైనా సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్లు సంచరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ డ్రోన్ల వ్యవహారంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆ డ్రోన్లు చైనాకు చెందినవిగా భావిస్తోంది. మన దేశంపై నిఘా, గూఢచర్యం కోసమే చైనా ఈ డ్రోన్లను భారత భూభాగంలోకి పంపించినట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి జగత్‌సింగ్‌ నేగీ అనుమానం వ్యక్తం చేయడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఆ రాష్ట్రంలోని కిన్నూర్ జిల్లాలో ఇటీవలి కాలంలో డ్రోన్లు కనిపించడం తీవ్ర చర్చకు దారి తీసింది.


భారత్-చైనా సరిహద్దు వెంబడి ఉన్న కిన్నూర్ జిల్లాలోని షిప్కీ లా, రిషి డోగ్రీ గ్రామాల్లో ఇటీవల డ్రోన్ల సంచారం పెరిగినట్లు మంత్రి జగత్‌సింగ్‌ నేగీ పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇలాంటి డ్రోన్లు తమ గ్రామాల్లో ఎగురుతూ కనిపించాయని స్థానిక గ్రామస్థులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంట చైనా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతోందని.. ఈ క్రమంలోనే సరిహద్దుకు ఇవతలి వైపు నిఘా, గూఢచర్యం కోసం చైనా ఇలాంటి డ్రోన్లను పంపించి ఉండే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి వాటిని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఇక ఈ డ్రోన్ల కదలికలను హిమాచల్ ప్రదేశ్ పోలీసులతో పాటు భారత సైన్యం కూడా గుర్తించినట్లు జగత్‌సింగ్ నేగీ చెప్పారు.


కిన్నూర్‌ జిల్లాలోని షిప్కీ లా, రిషి డోగ్రీ అనే రెండు గ్రామాలు కలిసి చైనాతో దాదాపు 240 కిలోమీటర్ల మేర సరిహద్దును కలిగి ఉంటాయి. ఇక్కడే 9 అత్యంత ఎత్తైన పర్వతాలు ఉండటం గమనార్హం. భారత భూభాగంలోకి చైనా డ్రోన్లు చొచ్చుకొచ్చి.. మన గగనతలాన్ని ఉల్లంఘిస్తున్నాయని హిమాచల్ మంత్రి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇది ఇలా ఉంటే ఇదే కిన్నూర్ జిలాలో ఉన్న 55 సరిహద్దు గ్రామాలను వైబ్రెంట్‌ విలేజ్‌ ప్రోగ్రామ్‌లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. మౌలిక వసతులతో సహా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


ఇక భారత్‌తో మాత్రమే కాకుండా ఇతర దేశాలతో కూడా చైనా కవ్వింపులు చేస్తూనే ఉంది. పొరుగున ఉన్న దేశాలపై నిఘా వేయడానికి ప్రత్యేక బెలూన్లను కూడా చైనా వినియోగిస్తుంది. ఇలాంటి బెలూన్లను కూల్చివేసే అంశంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇటీవల తీవ్రంగా సాధన చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న ఎలాంటి వస్తువును కూల్చడంపై కొన్ని నెలల క్రితం తూర్పు ఎయిర్‌ కమాండ్‌లో ట్రైనింగ్ జరిగినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com