ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ కౌంటర్‌ల‌లో సరికొత్త విధానం.. ఇకపై భక్తులకు ఈజీగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:52 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. లడ్డూల విషయంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు మొదలుపెట్టింది. తిరుమలలోని కౌంటర్ల దగ్గర ఎలాంటి ఆలస్యం లేకుండా.. త్వరగా భక్తులకు లడ్డూలను అందిస్తోంది. గతంలో చెప్పినట్లుగానే ఆధార్ ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు.. దీని కోసం ప్రత్యేకంగా స్కానింగ్ మెషిన్లను తీసుకొచ్చారు అధికారులు.


టీటీడీ ఐటీ విభాగం.. తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్‌లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే పనిలో ఉంది. తిరుమలలో లడ్డూ ప్రసాదాలను ప్రస్తుతం ఆధార్‌ కార్డ్‌ ఆధారంగా అందిస్తున్నారు. కొండపై కౌంటర్‌లలో ఒక్కో భక్తుడికి రెండేసి లడ్డూల చొప్పున టీటీడీ ఇస్తోంది. దీని కోసం ప్రసాదం కౌంటర్‌లోని కంప్యూటర్‌లో భక్తుల ఆధార్‌ వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ఆధార్ కార్డ్‌ల స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో ఉన్న 6 (51 నుంచి 61) లడ్డూ కౌంటర్‌లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన కౌంటర్‌లలో ఈ స్కానింగ్ మెషిన్లను వినియోగించే అవకాశం ఉంది.


తిరుమలలో లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ ప్రక్షాళన చేపట్టింది. కొంతమంది దళారులు తిరుమలలో లడ్డూలను భారీగా కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.. వాటిని తీసుకెళ్లి బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తేలింది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు గుర్తించారు. అందుకే లడ్డూల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా, దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ టీటీడీ ఆధార్ విధానాన్ని తీసుకొచ్చింది.


టీటీడీ ఐటw విభాగం సహకారంతో భక్తుల ఆధార్ కార్డు నమోదుతో లడ్డూలను విక్రయిస్తున్నారు. లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకొని వారు ఎన్ని లడ్డూలు తీసుకొంటున్నారు వంటి విషయాలు నమోదు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇస్తారు.. రూ.50 లడ్డూలు తగినన్ని ఇస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం కౌంటర్‌లకు వెళ్లే భక్తుల ఆధార్ వివరాలు తీసుకుని రోజువారీ రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారు. టీటీడీ ప్రతిరోజూ 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తుంటే.. ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నట్లు గుర్తించారు. మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని తేలింది. అందుకే టీటీడీ అప్రమత్తం అయ్యింది.. ఈ ఆధార్ విధానాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు తిరుమలతో పాటుగా తెలుగు రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా తిరుమల లడ్డూ ప్రసాదాలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com