ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలను చూసి నేర్చుకోండి.. తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 10:17 PM

 సెక్యులరిజం పేరుతో దేశంలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇతర మతాలపై ఏవైనా వ్యాఖ్యలు గానీ, దాడులు గానీ జరిగితే.. లౌకికవాదులు, న్యాయస్థానాలు ముందుకు వస్తాయని.. అదే హిందూ మతంపై, సనాతన ధర్మాన్ని కించపరిచినా, దాడులు చేసినా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ లాంటి వారు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ముందుకు వస్తే మతోన్మాదులుగా చిత్రీకరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని.. ఆ పాపాన్ని పోగొట్టేందుకు తాను ప్రాయిశ్చిత్త దీక్ష చేస్తే దాన్ని అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో సనాతన ధర్మాన్ని కొందరు కించపరిచారని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవమానించారని తీవ్రంగా మండిపడ్డారు.


తిరుపతిలో వారాహి సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక ప్రసంగం మొదట్లోనే ఓజీ, ఓజీ అంటూ పవన్ తర్వాతి సినిమా గురించి ఫ్యాన్స్ నినాదాలు చేయగా.. ఇది సినిమా ఫంక్షన్ కాదని వారిని పవన్ హెచ్చరించారు. ఇలాంటి వాటిలో ఇస్లాంను, ముస్లింలను చూసి మనం నేర్చుకోవాలని.. అల్లా అని వినిపించగానే వారు మొత్తం నిశబ్ధం పాటిస్తారని పేర్కొన్నారు. ఇక సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని వ్యాఖ్యలు చేసిన వారితో తాను గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. తాను ఒక హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చానని.. రాజకీయ నాయకుడిగా రాలేదని తేల్చి చెప్పారు. ఇతర మతాలను గౌరవించేదే సనాతన ధర్మమని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. ఇతర మతాలు కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు.


మనం ఇతర మతాలను చూసి నేర్చుకోవాలని.. కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మానికి అవమానం జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. తాను సనాతన ధర్మాన్ని ఆచరించేవాడిని అని.. అదే సమయంలో ఇస్లాం, క్రిస్టియన్, సిక్కు సహా ఇతర మతాల పట్ల కూడా అపార గౌరవం ఉందని చెప్పారు. గతంలో తాను ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలో నమాజ్ వినిపిస్తే.. తన ప్రసంగాన్ని ఆపానని.. తన కుమార్తెతో కలిసి తిరుమల కొండకు వెళ్తే డిక్లరేషన్ ఇప్పించినట్లు గుర్తు చేశారు. తాను సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.


కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తాము రాజకీయాల కోసం ఇవి చేస్తున్నామా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా ఓట్ల కోసమే మాట్లాడతామా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలా మాట్లాడే రోజు వస్తుందని తన జీవితంలో ఊహించలేదని పేర్కొన్నారు. తిరుమలలో అపచారం జరుగుతోందని.. సరిదిద్దండి అని గతంలోనే తిరుపతికి వచ్చి చెప్పానని.. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.


రామతీర్థంలో రాముడి విగ్రహం నరికేశారని.. సనాతన ధర్మం వైరస్ లాంటిదని, దాన్ని అంతం చేయాలని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారని.. అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని రాహుల్ గాంధీ అవహేళన చేశారని గుర్తు చేశారు. అలాంటివారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com