ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ జిల్లా పేరు మారనుందా..? చంద్రబాబుకు మంత్రి రిక్వెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం హయాంలోని పలు పథకాల పేర్లను మార్చింది. వైఎస్ జగన్‌తో పాటుగా వైఎస్ఆర్ పేరుతో ఉన్న పథకాలకు కూటమి సర్కారు కొత్త పేర్లు పెట్టింది. ఈ క్రమంలోనే మరో పేరు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పథకం పేరు కాకుండా.. జిల్లా పేరును మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా పేరును ఏపీ ప్రభుత్వం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.


"రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసిన గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిగా అవతరించి ఉన్నారు. ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంతవాసులకు దానవ పీడ తొలగించడానికి మశ్చ్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ది. ఆ తరువాత కృపాచార్యులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి హనుమత్ క్షేత్రమైన ఈ క్షేత్రంలో బస చేశారు. అక్కడ నుంచి తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకున్నారు".


" కానీ కొన్ని పరిస్థితుల వలన ముందుకు సాగలేకపోయారు. శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తపించిపోయారు. కానీ.. స్వామి సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులైనారు. అప్పటి నుంచి కృపాచార్యులు శ్రీవారి కృప పొందిన ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా.., కుడపగా క్రమేపి కడపగా ప్రసిద్ధి చెందింది." అంటూ సత్యకుమార్ యాదవ్ కడప చారిత్రక విశేషాలను రాసుకొచ్చారు.


అయితే శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు.. తిరుమల క్షేత్రానికి వెళ్లలేని భక్తుల కోసం తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్టించారన్న సత్యకుమార్ యాదవ్.. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారన్నారు. అప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్లే భక్తులు ముందుగా దేవుని కడప శ్రీవారిని దర్శించి తిరుమలకు వెళ్లడం ఆచారంగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇంతటి చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న కడప పేరును గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో వైయస్సార్ జిల్లాగా పేరు మార్చిందని విమర్శించారు.


పేరు మార్పుతో శ్రీవారి భక్తులు బాధపడ్డారన్న సత్యకుమార్ యాదవ్.. గత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయాన్ని తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. కడప జిల్లా అభివృద్ధికోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎంతో కృషిచేశారన్న సత్యకుమార్ యాదవ్.. కడప జిల్లా చారిత్రక నేపథ్యాన్ని. వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com