ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 06:47 PM

లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇటీవలే పేజర్స్, వాకీ టాకీలను పేల్చివేసిన ఇజ్రాయెల్.. తాజాగా భీకర వైమానిక దాడులకు పాల్పడింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడుల్లో కనీసం 182 మంది మరణించారని, 700 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని, అయితే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.‘ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి లెబనాన్ దక్షిణ పట్టణాలు, గ్రామాలపై శత్రు దాడులు జరిగాయి. 182 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారు. మరణించినవారిలో పిల్లలు, మహిళలు, పారామెడిక్స్ ఉన్నారు’’ అని పేర్కొంది.కాగా లెబనాన్‌లో దాడులపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ స్పందించారు.‘‘లెబనాన్‌లో మా దాడులను తీవ్రతరం చేస్తున్నాం. మా దేశ ఉత్తర భూభాగంలోని ప్రజలు వారి ఇళ్లలో ప్రశాంతంగా నివసించాలనే మా లక్ష్యం నెరవేరే వరకు మా చర్యలు కొనసాగుతాయి’’ అని స్పష్టం చేశారు. లెబనాన్‌లో వైమానిక దాడుల అనంతరం సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్‌లో దక్షిణం, తూర్పు బెకా లోయతో పాటు సిరియాకు సమీపంలో ఉండే ఉత్తర ప్రాంతంలో కూడా దాడులు చేశామని పేర్కొన్నారు.కాగా గతేడాది ఇజ్రాయె‌ల్‌లో నరమేధం సృష్టించిన హమాస్‌కు హిజ్బుల్లా మద్దతిస్తోంది. పలుమార్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి రాకెట్‌లను ప్రయోగించింది. అందుకే హిజ్జుల్లా స్థావరాలను దెబ్బతీయడంపై ఇజ్రాయెల్ దృష్టిసారించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com