తూర్పు గోదావరి జిల్లా, ఐ.పోలవరం కొమరగిరి సొసైటీలో ఏరియేటర్స్ స్కామ్ బయటపడింది. సొసైటీ అధ్యక్షుడు, సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయల ఏరియేటర్స్కు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని సొసైటీ మాజీ అధ్యక్షుడు కలిదిండి సీతారామరాజు జిల్లా సహకార బ్యాంకు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి.వెంకటనారాయణ మంగళవారం విచారణ నిర్వహించారు. 3గంటలు జరిగిన విచారణలో మురమళ్ళ డీసీసీబీ మేనేజర్ జీవీ మనోహర్, సొసైటీ సీఈవో ఎన్.గోపాలకృష్ణతో పాటు ఫిర్యాదుదారు కలిదిండి సీతారామరాజు హాజరయ్యారు. ఏరియేటర్లను రైతులకు అద్దెకిచ్చే వ్యాపారాన్ని సొసైటీ ప్రారంభించింది. కోట్లాది రూపాయల విలువైన ఏరియేటర్ల అద్దె వసూళ్లలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణ. బాధ్యులైన అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.