ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూలు.. పోలీసులకు షాకిచ్చిన సర్కార్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 10:30 PM

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీ హత్య, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తుతం దేశం మొత్తం మారుమోగిపోతోంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గత కొన్నేళ్లుగా జైలులోనే ఉంటున్నా.. తన సోదరుడు, మిత్రుడు, అనుచరులతో కలిసి బయట గ్యాంగ్‌ను నడిపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే.. ఇటీవల బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులతో మరోసారి వార్తల్లో నిలిచిన లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించిన కీలక విషయం బయటికి వచ్చింది. జైలులో ఉన్న సమయంలో ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఇద్దరు డీఎస్పీలు సహా మొత్తం ఏడుగురు పోలీసులపై వేటు పడింది. వీరందరినీ పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.


గతేడాది మార్చిలో కస్టడీలో ఉన్న సమయంలో ఓ టీవీ ఛానల్‌కు లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ ఇవ్వడంపై పంజాబ్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉండగా.. టీవీ ఛానల్‌లో రెండు ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం.. చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై పంజాబ్ హర్యానా కోర్టు సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పంజాబ్‌లోని జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడని సిట్‌ విచారణలో తేలింది. అప్పట్లో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ ప్రసారం కావడం తీవ్ర సంచలనం రేపింది. దాంతో లారెన్స్ బిష్ణోయ్‌తో పోలీసులు చేతులు కలిపారంటూ అప్పట్లోనే సిద్ధూ మూసేవాలా తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు.


ఇక లారెన్స్ బిష్ణోయ్‌కి సహకరిస్తున్నారని భావించిన పంజాబ్ సర్కార్.. ఈ వ్యవహారంలో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడుగురిలో ఇద్దరు డీఎస్పీ అధికారులు కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉన్న సమయంలో టీవీ ఇంటర్వ్యూకు అనుమతించినందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.


మరోవైపు.. గతకొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌.. బ్యారక్‌ల్లోకి అక్రమంగా సెల్‌ఫోన్ల వచ్చేవని.. వాటి ద్వారా తన అనుచరులతో నిత్యం టచ్‌లో ఉంటూ బయట కీలక వ్యక్తులను బెదిరించడం, హత్య చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలులో ఉంటూనే సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇక ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయం గురించి మాట్లాడుతూ.. కెనడియన్లకు సంబంధించిన సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించారని.. వాటిని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు అందించారని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com