ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ దూకుడు

international |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 09:59 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూకుడు కనబరుస్తున్నారు. అధ్యక్ష బరిలో ఆమె ముందంజలో ఉన్నట్లు ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైంది. ముందు ఉన్నంత దూకుడుగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం ఉండట్లేదు అనేది అమెరికా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరిలో ఉన్నంతవరకు.. డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా పవనాలు వీచాయి. సర్వేలు, విరాళాల్లో ట్రంప్ ఎప్పుడూ బైడెన్ కంటే ముందు కొనసాగారు. కానీ ఎప్పుడైతే బైడన్ తప్పుకుని.. కమలా హారిస్ రంగంలోకి దిగారో అప్పటి నుంచి ట్రంప్‌కు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విరాళాల సేకరణ విషయంలోనూ కమలా హారిస్‌దే పైచేయి కావడం విశేషం.


ఒక్క ఆగస్ట్ నెలలోనే కమలా హారిస్‌.. 36.1 కోట్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.3 వేల కోట్ల విరాళాలను సేకరించారు. దాదాపు 30 లక్షల మంది దాతలు కమలా హారిస్‌కు విరాళాలు ప్రకటించారు. అయితే ఆగస్ట్ నెలలో ట్రంప్‌కు వచ్చిన విరాళాల కంటే రెట్టింపు విరాళాలను కమలా హారిస్ పొందినట్లు తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. ఇక ప్రచారంలో దూసుకెళ్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే భారీగా విరాళాలు సేకరించడంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక మద్దతు కూడా భారీగా ఉంటోంది.


ఇక డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధికారికంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారిస్‌ పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ నేపథ్యంలోనే ఆగస్టులో 30 లక్షల మంది దాతల నుంచి రూ.3 వేల కోట్ల విరాళాలను అందుకున్నారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోల రాష్ట్రాల్లో రకరకాల కార్యక్రమాలను నిర్వహించేందుకు కమలా హారిస్‌ బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్‌ మాత్రం ఆగస్టులో 13కోట్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. వెయ్యి కోట్లను మాత్రమే సేకరించిన రిపబ్లికన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5వ తేదీన జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రాటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు ప్రచారాన్ని రోజురోజుకూ ముమ్మరం చేస్తున్నాయి. ఇందుకోసం మొత్తంగా 1 బిలియన్‌ డాలర్లు అంటే రూ.8400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అక్కడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకటనలు, ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి అయ్యే ఖర్చుల కోసం పార్టీలు దాతల నుంచి భారీగా నిధులను సేకరిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com