ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతుల అకౌంట్‌లలో డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 09:16 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది. రాజధానితో పాటుగా రైతులకు సంబంధించి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుపై సమీక్ష చేశారు. గత టీడీపీ ప్రభుత్వ (2014-2019) హయాంలో.. హ్యాపీ నెస్ట్‌ ప్లాట్లన్నీ ఒక్క గంటలో అమ్ముడు పోయిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చర్యల కారణంగా ఏర్పడిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ అయ్యిందని.. అమరావతి రైతులకు సెప్టెంబరు 15లోగా వార్షిక కౌలు చెల్లిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం అమరావతి రైతులకు పెండింగ్ లో పెట్టిన రూ.175 కోట్లను సెప్టెంబరు 15 లోగా చెల్లిస్తామని.. ఈ ఏడాదిలో ఇవ్వాల్సిన రూ.225 కోట్లను కూడా వీలైనంత త్వరలోనే చెల్లిస్తామన్నారు. అలాగే అమరావతిలో నిర్మాణాలపై సెప్టెంబరు మొదటి వారంలో ఐఐటీ చెన్నై, హైదరాబాద్‌ల నుంచి నివేదికలు వస్తాయని.. 2025 జనవరి నాటికి అమరావతిలో అన్ని పనులూ మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపారు. అమరావతిని హైటెక్ నగరంగా నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనన్నారు.


హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి క్లియరెన్స్ ఇచ్చారని.. గతంలో రూ.700 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రూ.930 కోట్లు అవసరం ఉందన్నారు. అంతేకాదు సీఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. అమరావతిలో ఇంకా 3,550 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిలిపివేయటం వల్ల సీఆర్డీఏకి రూ. 216 కోట్లు నష్టం వచ్చిందన్నారు. అయితే నష్టం వస్తోంది ఈ ప్రాజెక్టు నిలిపివేస్తామంటే రెరా కూడా అంగీకరించదన్నారు. ప్రభుత్వానికి భారమైనా హ్యాపీనెస్ట్ పూర్తి చేసి బుక్ చేసుకున్నవారికి అందిచాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు మంత్రి నారాయణ.


మరోవైపు రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ఊపందుకున్నాయని.. దీనీకోసం 190 ప్రొక్లెయిన్లు వినియోగిస్తున్నామని, 60 శాతం పూర్తయినట్టు అధికారులు చంద్రబాబుకు వివరించారు. అలాగే 90 రోజుల్లో సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి చేయాలని.. అమరావతిని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సిటీగా తీర్చిదిద్దాలన్నారు. ఏఐ, అమరావతిని కలిపి ఇంగ్లీష్‌లో లోగో రూపొందించాలని, అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు.


అమరావతిలో ఎస్‌ఐఆర్‌డీ (స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్) ఏర్పాటుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కసరత్తు చేస్తోంది. ఎస్‌ఐఆర్‌డీ నిర్వహించిన ఓ జాతీయస్థాయి శిక్షణా కార్యక్రమానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్‌కు ఈ విషయాన్ని తెలిపారు. ఎస్‌ఐఆర్‌డీను 10ఎకరాల్లో రూ.250 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వాటిని కేంద్రానికి పంపుతామని చెప్పారు. పంచాయతీరాజ్‌ సిబ్బందికి శిక్షణనిచ్చే సంస్థ గ్రామ, వార్డ్‌ శాఖలో ఉండటం సరికాదని.. దాన్ని పంచాయతీరాజ్‌శాఖలో విలీనం చేయాలని అధికారులు ముఖ్యమంత్రి ప్రతిపాదనలు పంపారు. దీంతో చంద్రబాబు స్పందించి.. వెంటనే పంచాయతీరాజ్‌శాఖలో విలీనం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com