ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైల్లో నటుడు దర్శన్2కు రాజభోగాలు.. ఏడుగురు జైలు అధికారులకు షాక్

national |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 11:04 PM

యూట్యూబర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప.. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఆయనకు జైల్లో రాచమర్యాదలు జరుగుతోన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. జైలు ప్రాంగణంలో రౌడీషీటర్లతో కూర్చొని కాఫీ తాగుతూ, సిగరెట్‌ కాల్చుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సర్కారు.. జైలు సూపరింటెండెంట్‌ను కూడా బదిలీ చేస్తామని ప్రకటించింది. దీనిపై కర్ణాటక హోమ్ మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ‘ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ విషయం నా నోటీసుకు వచ్చింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అధికారులతో చర్చించాం.. ప్రాథమిక విచారణలో జైలు సిబ్బంది శరణబసవ అమీనగడ, ప్రభు, తిప్పేస్వామి, వెంకప్ప కోర్టి, సంపత్‌కుమార, శ్రీకాంత్‌ తలవార్, బసప్ప తేలిల నిర్లక్ష్యాన్ని గుర్తించి, వారిని సస్పెండ్‌ చేశాం’ అని ఆయన వెల్లడించారు.


జైలులో ఉంటున్న రౌడీషీటర్‌ జానీ విల్సన్ గార్డెన్ నాగా అలియాస్‌ జనార్దన్‌ కుమారుడు సత్యతోనూ దర్శన్‌ వీడియో కాల్‌లో మాట్లాడినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. ఆ రౌడీషీటర్‌ కుమారుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలో నటుడు దర్శన్, ఆయన మేనేజర్, రౌడీ షీటర్ విల్సన్, కుల్ల సీనా అనే మరో ఖైదీ ఈ నలుగురు ఉన్నారు. అలాగే, దర్శన్ వీడియో కాల్ మాట్లాడుతోన్న మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడికి జైల్లో రాజభోగాలు అందుతున్నాయని మండిపడుతున్నారు. య్యూట్యూబర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రా గౌడ సహా 16 మంది నిందితులుగా ఉన్నారు. పవిత్ర గౌడకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెట్టాడనే ఆరోపణలతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.


కాగా, దర్శన్ ఫోటోపై రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ స్పందించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి, బాధ్యులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలతో కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలనే ఆలోచన కలుగుతోందని అన్నారు. హత్య కేసులో నిందితుడు జైల్లో కుర్చీపై కూర్చుని దర్జాగా చేతిలో సిగరెట్ పట్టుకుని, కాఫీ తాగుతూ ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com