ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 07:29 PM

అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్యన వివాదం ముదురుతోంది. నిన్న మొన్నటి వరకూ సోషల్ మీడియాలో అభిమానుల వరకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయాల వరకూ వెళ్లింది. ఏకంగా జనసేన ఎమ్మెల్యే దీనిపై స్పందించేంత దూరం వచ్చింది. అల్లు అర్జున్. మెగా ఫ్యాన్స్ మధ్యన నెలకొన్న వివాదంపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన శ్రీనివాస్.. అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే తనకు తెలవదన్న బొలిశెట్టి.. ఉన్నది మెగా ఫ్యాన్స్ ఒక్కటేనన్నారు. అలా కాకుండా నేనే పెద్ద, నాకిష్టమైతే వస్తానంటే ఎవడు రమ్మన్నాడంటూ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ.. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


"అల్లు అర్జున్ ఫ్యాన్ అనేదే నాకు తెలియదు. ఉన్నది ఒక్కటే మెగా ఫ్యాన్స్. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా బ్రాంచ్‌లాగా షామియానా, టెంట్లు వేసుకుంటే తెల్వదు కానీ.. ఉన్నది మాత్రం మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉండేది చిరంజీవి ఫ్యామిలీ. అంతే తప్ప అల్లు అర్జున్‌కు అభిమానులు ఉన్నారని నాకు తెలియదు. ఆయన అలా ఊహించుకుంటూ ఉండొచ్చు. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆయనలో చిరంజీవి అభిమానులు చిరంజీవిని, రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్‌ను, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్‌ను చూసుకుంటున్నారు. అవన్నీ కాకుండా నేను పెద్ద.. నాకు ఇష్టమైతేనే వస్తా అంటే ఎవడు కావాలన్నాడు. మేమేమైనా రావాలని అడిగామా.. రావద్దులే వెళ్లిపో. నువ్వు వస్తే ఏంటీ రాకపోతే ఏంటి? 21 చోట్ల నిలబడితే 21 చోట్లా నెగ్గాం. నువ్వు వెళ్లిన ఒక్క చోట కూడా ఓడిపోయింది. మీ నాన్నను ఎంపీగా కూడా గెలిపించుకోలేకపోయావ్. మళ్లీ అందరిని విమర్శిస్తావ్" అంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లినప్పటి నుంచి.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ ముదురుతోంది. ఇక ఆ తర్వాత ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమయ్యాయి. అల్లు అర్జున్ పేరును ప్రస్తావించకపోయినా కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మంటపెట్టాయి. అడవుల పరిరక్షణ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. గతంలో సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని... కానీ ఈ రోజుల్లో అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. దీంతో అల్లు అర్జున్ నటించిన పుష్పమూవీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు.


ఇదిలా ఉండగానే ఇటీవల జరిగిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఈ మంటపై పెట్రోల్ పోశాయి. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. సాధారణంగా హీరోను చూసి ఫ్యాన్స్ అవుతారు. కానీ నేను నా అభిమానులను చూసి హీరోనయ్యా. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడాలి. మనవాళ్లు అనుకున్న వారి కోసం ఎంతవరకైనా వెళ్తా.. నాకు ఇష్టమైతే వస్తా.. ఏదైనా చేస్తా అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ కూడా అల్లు అర్జున్ అటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేరు కానీ.. ఇటు పవన్ కళ్యాణ్ పేరు కానీ ప్రస్తావించలేదు. కానీ అల్లు అర్జున్ నంద్యాల ఎపిసోడ్ గుర్తుకుపెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన బొలిశెట్టి.. నా కిష్టమైతే వస్తా అంటే ఎవడు రమ్మన్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com