ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్.... ఏం మార్పులు రానున్నాయంటే

business |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 08:11 PM

సాధారణంగానే కొత్త నెల ప్రారంభం అవుతుందంటే కొత్త కొత్త నియమాలు అమలులోకి వస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను నెల ప్రారంభం నుంచే అందుబాటులోకి తెస్తారు. ఇలా వచ్చే కొత్త మార్పులు కొన్నిసార్లు ప్రయోజనం చేకూర్చుతే, కొన్ని సార్లు ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ఆగస్టు నెల ముగించుకుని సెప్టెంబర్ నెలలోకి కొద్ది రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. వచ్చే సెప్టెంబర్ నెలలోనూ కొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. అందులో గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.


ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర


చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తాయి. కొన్ని సార్లు రేట్లను తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు లేదా స్థిరంగా కొనసాగించవచ్చు. గత నెలలో వాణిజ్య సిలిండర్ ధరలను కేంద్రం పెంచిన సంగతి తెలిసింది. ఒకటో తేదీన మళ్లీ పెంచే సూచనలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వంట గ్యాస్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను మార్చే అవకాశం ఉంటుంది. గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పులు జరగలేదు. అయితే, ఒకటో తేదీనా ఏదైనా మార్పు ఉంటుందేమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు సైతం మారే అవకాశం ఉంటుంది.


ఉద్యోగులకు డీఏ పెంపు..


సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మరో 3 శాతం పెంచనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై సెప్టెంబర్ 1న ప్రకటన ఉండనుంది. ఇప్పటికే ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్సు 50 శాతానికి చేరింది. మరో 3 శాతం పెంచితే 53 శాతానికి చేరుతుంది. చూడాలి మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.


ఆధార్ కార్డు ఉచిత అప్డేట్..


ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14, 2024 వరకు గడువు ఉంది. డెమోగ్రాఫిక్ సమాచారం ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ గడువులోపు చేసుకుంటే ఉచితంగా అయిపోతుంది. గడువు దాటితే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. గతంలో ఈ గడువును పలుమార్లు పెంచారు. అయితే మళ్లీ పెంచుతారనే నమ్మకం లేదు.


క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్..


క్రెడిట్ కార్డు యూజర్లకు సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకటో తేదీ నుంచి క్రెడిట్ కార్డు రూల్స్ మార్చుతోంది. రివార్డు పాయింట్లకు పరిమితి విధిస్తోంది. కస్టమర్లు ప్రతి నెలా 2 వేల పాయింట్లు మాత్రమే పొందేందుకు వీలుంటుంది. అంతకు మించి పొందలేరు. ఇక ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కనీస మొత్తాన్ని తగ్గించనుంది. అలాగే పేమెంట్ తేదీని 15 రోజులకు పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఫేక్ కాల్స్‌పై కొత్త రూల్స్..


సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫేక్ కాల్స్‌, మెసేజ్‌లపై ట్రాయ్ నిషేధం విధిస్తుందని సమాచారం. ఇప్పటికే అలాంటి కాల్స్ ఆపేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది ట్రాయ్. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com