కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ అన్నారు. జంగారెడ్డిగూడెం పరిధిలోని గురవాయిగూడెంలో కరాటం రాంబాబు నివాసం వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న ఏలూరు పట్టణాన్ని పారిశ్రామిక హబ్గా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా మలేషియా వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడి పామాయిల్ రైతుల పరిస్థితులపై అధ్యయనం చేస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కూటమి నాయకులు కరాటం రెడ్డిబాబు, బొరగం శ్రీను, మేకా ఈశ్వరయ్య, దాసరి శ్యామ్ చంద్రశేషు, గడ్డమణుగు రవికుమార్, రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.