నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం టీచింగ్ స్టాఫ్ వర్సెస్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేలా పరిస్థితులు మారాయి. కొద్దిరోజులుగా తరచూ వీరి మధ్య వివాదాలు నెలకుంటున్నాయి. తాజాగా రెండు రోజుల కిందట జరిగిన ఓ ఘటన చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి తన వ్యక్తిగత అవసరానికి ఇనిస్టిట్యూట్కు చెందిన అధికారిక వాహనాన్ని ఉపయోగించగా దానిని నాన్ టీచింగ్ విభాగంలోని ఓ ఉద్యోగి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మరింత చిచ్చు రాజేసింది. ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ హోదాలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి అత్యవసర సమావేశం ఉండడంతో తాను బయటకు వెళ్లలేక నూజివీడు పట్టణంలో చదువుతున్న తన కుమారుడిని క్యాంపస్కు తీసుకొచ్చేందుకు అధికారిక వాహనాన్ని పంపారు. పట్టణంలోని ఓ కాలేజీ వద్దకు ఆ వాహనం వెళ్లడం గమనించిన మెకానికల్ విభాగంలోని ఓ నాన్ టీచింగ్ ఉద్యోగి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వివాదానికి దారి తీసింది. ఇటీవల టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన క్వార్టర్స్లో దొంగతనం జరగడం, వాహన వివాదం నేపథ్యంలో ఆ ఉన్నతాధికారి నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యవహార శైలిపై సామాజిక మాధ్యమంలో తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాక నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యవహార శైలిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు రంగంలోకి దిగి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.