ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటుకు నోటు కేసులో పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 07:44 PM

 గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడులపై.. ఈ ఓటుకు నోటు కేసులో ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై దాఖలు చేసిన రెండు పిటిషన్లను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి.. చంద్రబాబుపై వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది.


ఓటుకు నోటు కేసులో నారా చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలోనే రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాజాగా సుప్రీంకోర్టు జడ్జిలు.. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ ఓటుకు నోటు కేసులో ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయని.. అయితే ఈ పిటిషన్లపై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల కోసం కోర్టులకు రావద్దని పిటిషనర్‌కు సూచించింది. అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది.


  ఈ ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేని అంశాలను తీసుకువచ్చి.. సుప్రీంకోర్టుతో ఆటలాడుకోవద్దని.. రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపైనా సుప్రీంకోర్టు ఆరా తీసింది. పిటిషనర్‌ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. 2014 నుంచి 2024 ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన నాయకుడు అని.. అయితే ఈ పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కూడా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే ఉందని సీనియర్‌ లాయర్ సిద్దార్థ లూథ్రా కోర్టుకు వివరించారు.


ఈ క్రమంలోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు లాయర్.. ఆ కేసుల జాబితాను కోర్టుకు సమర్పించారు. అయితే ఆ కేసులకు.. ప్రస్తుతం వాదనలు జరుగుతున్న కేసులకు ఎలాంటి సంబంధం లేదని లాయర్ సిద్ధార్థ లూథ్రా తెలిపారు. కేసుల జాబితా పరిశీలించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com